నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదలవుతుంది. గత 10-15 రోజుల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నాలుగు రోజులలో మరో 50 లక్షల మంది భక్తులు తరలివస్తారు.
మేడారం మహాజాతరకు టిజీఎస్ ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి 4,000 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. సుమారు 4-5 లక్షల ప్రైవేట్ వాహనాలు వస్తాయని జిల్లా అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ భారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఒకేసారి ఇన్ని లక్షల వాహనాలు వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేయడం చాలా కష్టం. కనుక మేడారం చేరుకునేందుకు రెండు మార్గాలు, తిరిగి వెళ్ళేందుకు రెండు మార్గాలని నిర్ణయించి ఆ ప్రకారమే వాహనాలు పంపిస్తున్నారు.
వరంగల్ వైపు నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను ఆరేపల్లి-ములుగు-వెంగళాపూర్-నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది.
ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వాహనాలు భద్రాచలం, మణుగూరు, బయ్యారం, ఏటూరునాగారం, కొండాయి మీదుగా మేడారంకు 4 కిమీ దూరంలో ఊరట్టం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ వరకు అనుమతిస్తారు.
మహారాష్ట్ర, రామగుండం, కరీంనగర్, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం వద్ద ఎడమవైపు రోడ్డులో ప్రయాణిస్తూ పెగడపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ ప్రదేశం చేరుకోవాల్సి ఉంటుంది.
ఆర్టీసీ బస్సులను మాత్రం మేడారం గద్దెలకు అర కిమీ దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరకు సంబంధించి సమాచారం కొరకు జిల్లా అధికారులు ఓ మొబైల్ యాప్, వాట్సప్ చాట్ బోట్, ఓ వెబ్సైట్ రూపొందించారు.
మేడారం మహాజాతర మొబైల్ యాప్:
https://play.google.com/store/apps/details?id=com.itprofound.medaramjathara
మేడారం మహాజాతర వెబ్సైట్: https://medaramjathara2026.com
మైమేడారం వాట్సప్ చాట్ బోట్ నం: 76589 12300.