పంజాబ్లో మంగళవారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండు ప్రేలుళ్ళు జరిగాయి. ఒకటి జలంధర్లో మరొకటి అమృతసర్లోజరిగాయి.
మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు జలంధర్లోని సరిహద్దు భద్రతా దళం ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఓ వ్యక్తి స్కూటీని పార్క్ చేసినప్పుడు హటాత్తుగా మంటలు అంటుకొని బాంబుతో పేల్చేసినట్లు పేలిపోయింది. దానిని అక్కడ పార్క్ చేసిన వ్యక్తి త్రుటిలో తప్పించుకొని దూరంగా పారిపోయాడు.
ఇది జరిగిన రెండు గంటల తర్వాత అంటే రాత్రి సుమారు 10 గంటలకు అమృతసర్లోని అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ సమీపంలో భారీ శబ్దాలతో ప్రేలుడు జరిగింది. మొహాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని దుండగులు ఈ ప్రేలుళ్ళు జరిపినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
ఇవి ప్రమాదమా లేక ఉగ్రదాడులా? ఈ రెండు ప్రేలుళ్ళకు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో నిఘా సంస్థ దర్యాప్తు మొదలుపెట్టింది. భద్రతా దళాలు, డాగ్, బాంబ్ స్క్వాడ్స్, ఫోరెన్సిక్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు.