కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఈరోజు తన మావగారి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణం తెలిస్తే దిగ్బ్రాంతి కలుగుతుంది.
ఐదు రోజుల క్రితం ఆయన భార్య దివ్య కడుపు నొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అందరూ ఎస్సై చంద్రశేఖరే భార్య ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. అతను పోలీస్ ఎస్సైగా చేస్తున్నాడు కనుక తన పరపతి ఉపయోగించి కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే, ఆయన భార్యని చాలా ప్రేమిస్తున్నాడు. ఆమె నిజంగానే కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుంది. ఎంతగానో ప్రేమిస్తున్న భార్య చనిపోవడంతో దుఃఖిస్తున్న చంద్రశేఖర్ ఈ సూటిపోటి మాటలను భరించలేకపోయాడు.
అయినప్పటికీ భార్య అంత్యక్రియలు చేసి సాంప్రదాయం ప్రకారం నేడు 5వ రోజున పిట్టకు ఆహరం పెట్టి ఇంటికి తిరిగివచ్చి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన కూతురు చావుకు అల్లుడు కారణం కాదని అత్తమామలు చెప్తున్నా జనాలు అనుమానిస్తుండటంతో చంద్రశేఖర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయం సూసైడ్ లెటర్లో వ్రాసినట్లు సమాచారం. ఐదు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరోఒ ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.