బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈ మూడు జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో కేటీఆర్ మైక్ అందుకొని మాట్లాడబోతుంటే, అభిమానులు సిఎం… సిఎం... అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
అప్పుడు కేటీఆర్ వారిని ఉద్దేశ్యించి “ఎన్నికలలో ఓడగొట్టి ఇప్పుడు సిఎం సిఎం అంటున్నారేమిట్రా...నాయినా? హన్మకొండలో ఓడగొట్టారు… తూర్పులో ఓడగొట్టిన్రు.. మీకు దణ్ణం పెడతా... ఊరుకోండ్రా నాయినా...” అంటూ ఆయన కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆయన మాటలు విని అందరూ హాయిగా నవ్వుకున్నారు.
ఈ సందర్భంగా వేదికపైనే ఉన్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుతూ, “ఆయన నా యవ్వనమంతా ఇలాగే గడిచింది...” అంటూ చెపితే ఏదో లవ్ స్టోరీ చెపుతారని అనుకున్నాను. కానీ ఆయన తెలుగు టీవీ సీరియల్స్ మనసు-మమతా, శ్రీనివాస కళ్యాణం గురించి చెప్పారు. మీరు టీవీ సీరియల్స్ కూడా చూస్తారా? అంత టైమ్ ఉంటుందా? అని ఆశ్చర్యపోయాను,” అని కేటీఆర్ మాటలకు మళ్ళీ అందరూ హాయిగా నవుకున్నారు.
ఆ తర్వాత “కాసేపు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాము,” అంటూ ఆ అంశం గురించి కేటీఆర్ మాట్లాడారు.