నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా రేపు శుక్రవారం విడుదల కావలసి ఉండగా, నరేష్ భార్య రమ్యా రఘుపతి కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఈరోజు కేసు వేశారు. తమ నిజజీవితం ఆధారంగా తీసిన ఆ సినిమాలో తనని చాలా కించపరిచేలా చూపారని, కనుక ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దీనిపై కోర్టు ఇంకా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ఆమె వాదనలతో ఏకీభవిస్తే, సినిమా ప్రదర్శన నిలిపివేస్తూ స్టే విధించి, కౌంటర్ దాఖలు చేయాలని నరేష్, పవిత్రా లోకేష్, దర్శకుడు ఎంఎస్ రాజులను ఆదేశించే అవకాశం ఉంది.
సినిమా టీజర్, ట్రైలర్ రెండూ కూడా ఇది నిజజీవితంలో నరేష్ వివాహాల గురించి, నరేష్, పవిత్రా లోకేష్లు కలిసి జీవించడం గురించే అని అర్దమవుతుంది. కానీ ఇది నరేష్ నిజజీవితానికి సంబందించిన సినిమా కాదని, సినిమా చూస్తే అసలు విషయం అర్దమవుతుందని దర్శకుడు ఎంఎస్ రాజు అన్నారు. కానీ ఇప్పుడు వారి పంచాయతీ ఫ్యామిలీ కోర్టుకి వచ్చింది కనుక రేపు ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి.