దేశంలో అన్ని రంగాలలో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ. కానీ తెలంగాణ జిల్లాలలో అడపా దడపా పరువుహత్యలు, మంత్రాలు, మూడనమ్మకాలతో హత్యలు జరుగుతుండటం చాలా బాధాకరమే. తాజాగా జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామశివారులో సోమవారం సాయంత్రం ఓ దారుణహత్య జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం హైదరాబాద్లోని ఆల్వాల్కు చెందిన పవన్కుమార్ బల్వంతపూర్కు చెందిన కృష్ణవేణిని వివాహం చేసుకొన్నాడు. ఆమె సోదరుడు విజయ్ అక్కడే గ్రామశివారులో ఓ కుటీరం, పక్కనే చిన్న ఆలయం నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. ఈనెల 13వ తేదీన కృష్ణవేణి మరో సోదరుడు జగన్ గుండెపోటుతో చనిపోయాడు. కనుక పవన్కుమార్, కృష్ణవేణి అతని భార్య సుమలతను పరామర్శించేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బల్వంతపూర్ చేరుకొన్నారు. అయితే పవన్కుమారే మంత్రాలతో చేతబడి చేసి తన భర్తను చంపించేశాడని సుమలత ఆరోపించడంతో వారు దిగ్బ్రాంతి చెందారు. ఆమె కృష్ణవేణిని ఏదో వంకతో దూరంగా పంపించి తన బందువులతో కలిసి పవన్కుమార్ను కుటీరంలోని ఓ గదిలో బందించి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి గదికి బయట తాళం వేసింది. దాంతో అతను తప్పించుకొనే దారిలేక గదిలోనే సజీవదహనమయ్యాడు. విషయం తెలుసుకొన్న కృష్ణవేణి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి వారితో కలిసి అక్కడకు చేరుకొంది. కానీ అప్పటికే పవన్కుమార్ చనిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని జగన్ భార్య సుమలతను, మరికొందరిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బావమరిది చనిపోతే పరామర్శించడానికి వస్తే అతనినే సజీవదహనం చేయడం చూసి ఊళ్ళో అందరూ షాక్ అయ్యారు.