మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో మొత్తం 11 మంది ప్రధాన పూజారులు ఉన్నారు. వారిలో ఒకరైన దశరధం ఈరోజు ఉదయం కన్ను మూశారు. మేడారం జాతరలో ఆయన కూడా అన్ని పూజా కార్యక్రామలలో చురుకుగా పాల్గొన్నారు. కానీ జాతర ముగిసిన మర్నాడే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తూనే ఉంది. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. మేడారం జాతరలో అందరినీ ఆప్యాయంగా పలకరించి పూజలు చేయించిన దశరధం చనిపోయారనే వార్తను ఆదివాసీలు నమ్మలేకపోతున్నారు. మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది.
గత ఏడాది అక్టోబర్లోనే ఆలయ ప్రధాన పూజారులలో ఒకరైన సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్య సమస్యాలతో చనిపోయారు. ఆరు నెలలోగా ఇప్పుడు మరో పూజారి దశరధం కూడా మృతి చెందడంతో ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.