మమ్మల్ని ప్రజలెన్నుకొన్నారు...గవర్నర్‌ నామినేట్ అయ్యారు

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్‌గారు ఓ రాజ్యాంగ పదవిలో ఉండి ప్రెస్‌మీట్‌లు పెట్టడం సరికాదని నేను గతంలోనే చెప్పాను. ఉపరాష్ట్రపతి, గవర్నర్‌, లెఫ్టినెంట్ గవర్నర్‌ వంటి నామినేటడ్ పదవులకు కొన్ని పరిమితులు ఉంటాయి. కనుక వారు ఆ పరిది దాటి వ్యవహరించకూడదు. కానీ గవర్నర్‌గారు ప్రెస్‌మీట్లు పెట్టి సిఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదన్నట్లు మాట్లాడటం  చాలా తప్పు. ఆమె గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఆమె నామినేటడ్ పోస్టులో ఉన్నారు.కానీ మాది ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం. కనుక గవర్నర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి మా ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఆమె చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆమె గవర్నర్‌లాగ హుందాగా వ్యవహరించాలి కానీ ఓ రాజకీయ పార్టీ నాయకురాలిలాగ వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు,” అని అన్నారు.