
తెలంగాణ ముఖ్యమంత్రి గత కొంతకాలం బహిరంగ సభలు, ప్రెస్మీట్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీపై, కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నారు.వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తానని గట్టిగా నొక్కి చెపుతుండటంతో మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సిఎం కేసీఆర్కు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. సోమవారం పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సిఎం కేసీఆర్కు ఫోన్ చేసి బిజెపియేతర పార్టీలతో కూటమి ఏర్పాటు గురించి చర్చించారు. తాను ఇదే విషయమై తమిళనాడు సిఎం స్టాలిన్తో కూడా ఫోన్లో మాట్లాడానని మమతా బెనర్జీ తెలిపారు.
కూటమి ఏర్పాటు గురించి చర్చించేందుకు ఆమె హైదరాబాద్ రావడమో లేదా తాను కోల్కతా వెళ్ళి కలవడమో చేస్తానని సిఎం కేసీఆర్ చెప్పారు. త్వరలోనే ముంబై వెళ్ళి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో సమావేశమవుతానని సిఎం కేసీఆర్ మొన్ననే చెప్పారు. కనుక సిఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు మళ్ళీ మొదలైనట్లే భావించవచ్చు.