
గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ రేపు (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా టాక్సిక్ టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు నిర్మాణ సంస్థ అనుమతి కోరగా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది.
దాని ప్రకారం రేపటి నుంచి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్పై రూ.50, మల్టీప్లెక్స్లలో రూ.100 చొప్పున టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే ఇందుకు ప్రభుత్వం ముందే ఓ షరతు విధించింది. సినిమా నిర్మాణ సంస్థలు కేవిఎన్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ రెండూ కలిపి మొదటి పది రోజుల అదనపు రాబడిలో 20 శాతం లేదా కోటి రూపాయలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ బ్యాంక్ ఖాతాలో జమా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సొమ్ముని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.