రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ సూపర్

‘కింగ్‌డమ్‌’ ట్రైలర్ శనివారం తిరుపతిలో  విడుదల చేస్తున్నప్పుడు రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ విని సీమలో అభిమానులు పులకించిపోయారు. “ఏడాదిగా ఈ సినిమా గురించే ఆలోచిస్తున్నా.

అప్పుడు నా మనసులో ఒకటే అనిపించింది. తిరుపతి వెంకన్నసామి ఈ ఒక్కసారి నా పక్కనుండి నడిపించారో చాలా పెద్దోడినవుతా.... పోయి టాప్‌లో కూర్చుంటా.

ఎప్పట్లాగే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేశా. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు. అనిరుధ్ సంగీతంతో పగలగొట్టాడు. దర్శక నిర్మాతలు, హీరోయిన్‌ భాగ్యశ్రీ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇంకా చేస్తూనే  ఉన్నారు.

ఇక మిగిలింది రెండే. ఒకటి ఆ వెంకన్నసామి ఆశీసులు, రెండు  ప్రేక్షకుల దయ. ఈ రెండూ నాతో ఉంటె ఎవరు మనల్ని ఆపేదేలే,” అంటూ విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో డైలాగులు చెపుతుంటే అభిమానులు ఉప్పొంగిపోయి ఈలలు కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.       

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోరే జంటగా చేసిన కింగ్‌డమ్‌లో సత్యదేవ్ రుక్మిణీ వసంత్, కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.  

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది. 

రేపు (సోమవారం) హైదరాబాద్‌, యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ ఈవెంట్‌కి టికెట్స్, పాసులు కావలసినవారు https://www.shreyasgroup.net/event వెబ్‌సైట్‌లో పొందవచ్చు.