
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ‘సప్త సాగరాలు దాటి-సైడ్ ఏ’ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదలైంది. హేమంత్ ఎం.రావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కాస్త నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనం పరీక్షించినా ‘ఓ అందమైన ప్రేమకావ్యం’గా మంచి టాక్ తెచ్చుకొంది. ముఖ్యంగా హీరోయిన్గా నటించిన రుక్మిణీ వసంత్ తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో మెప్పించింది.
ఇంత మంచి సినిమాకు థియేటర్స్ దొరకకపోవడంతో వారం రోజులు తిరక్కముందే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకొంది. ఇప్పుడు దీని రెండో భాగంగా తెరకెక్కించిన ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బి’ నవంబర్ 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్లో ప్రకటించింది. ఈ సినిమాకు సంగీతం: చరణ్ రాజ్, కెమెరా: అద్వైత గురుమూర్తి అందించారు.