ఒకప్పుడు ప్రజలను గడగడలాడించిన బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కధ ఆధారంగా ఆదేపేరుతో తీస్తున్న సినిమాలో మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. కనుక ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇవాళ్ళ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానిలో రవితేజ నటన, ఆనాడు దొంగల దోపిడీ తీరు ట్రైలర్లో కళ్ళకు కట్టిన్నట్లు దర్శకుడు వంశీ చూపించారు. ట్రైలర్ చూసినప్పుడు ఇలాంటి బందిపోటు దొంగలతో ఆనాడు ప్రజలు ఎంతగా బాధపడేవారో? వారిని అడ్డుకోలేక ప్రభుత్వం, పోలీసులు ఎన్ని తిప్పలు పడేవో అని అనిపించక మానదు.
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటిస్తోంది. నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, నాజర్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్ పేరడీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాలో ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణంగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వంశీ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: మాధే, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ చేస్తున్నారు.
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. దీనిని తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు.