ఏపీ సిఎం పవన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలలో పోటీ చేయకుండానే ఏపీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయనను సిఎంను చేసింది మరెవరో కాదు బ్రో సినిమాలో నటించిన ఊర్వశీ రౌతేలా. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వేదికపై పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తున్నప్పుడు అభిమానులు “సిఎం... సిఎం...’ అని కేకలు పెట్టారు.

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీతో రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటూ తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెపుతుండటంతో అభిమానులు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకొంటూ ఆవిదంగా కేకలు పెడుతుంటారు. 

అవి విని ఊర్వశీ రౌతేల బ్రో సినిమాలో తాను నిజంగానే ఏపీ సిఎం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించానని అనుకొన్నట్లుంది. అందుకే “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌గారితో కలిసి బ్రో సినిమాలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది,” అంటూ బ్రో స్టోరీ లైన్ చెప్పి నేడు ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమా విడుదల కాబోతోందని తెలియజేసింది. 

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకొంటున్నారు కనుక ఆమెకు థాంక్స్ చెపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఊర్వశీ రౌతేల నోటి మాట నిజమై తమ అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలని వారు కోరుకొంటున్నారు. 

సముద్రఖని దర్శకత్వంలో తెర కెక్కిన బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్, కేతికా శర్మ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.