
ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు అందించిన దర్శకుడు రాంగోపాల్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన హీరోయిన్ల పాదాలు నోట్లో పెట్టుకొని చప్పరించే స్థాయికి ఎదిగిపోయారు. సాధారణ దర్శకుడు స్థాయి నుంచి పెయిడ్ దర్శకుడుగా రాజకీయ నాయకుల అవసరాలకు తగ్గట్లు సినిమాలు చేస్తూ మరో స్థాయికి ఎదిగిపోయారు.
ఆయన ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సినిమాలు తీస్తూ, సోషల్ మీడియాలో దాని రాజకీయ ప్రత్యర్ధులపై వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వాటిలో భాగంగానే వ్యూహం అనే సినిమా సిద్ధం చేస్తున్నారు.
ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా టిడిపి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మద్య సాగిన రాజకీయాలను సిఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళతో ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఆ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేశారు.
దానిలో కడప జిల్లా, పావురాలగుట్టలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో టీజర్ మొదలుపెట్టి, “అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాను” అంటూ జగన్ చెపుతూ ముగించారు.
ఈ సినిమా ప్రధానంగా టిడిపిని, చంద్రబాబు నాయుడుని, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు, సిఎం జగన్మోహన్ రెడ్డిని మరింత ప్రమోట్ చేసేందుకే అని వేరే చెప్పక్కరలేదు. దీనిని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్పై వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.