
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మద్యలో ఇవాళ్ళ (బుదవారం) చిన్న బ్రేక్ దొరకడంతో పవన్ కళ్యాణ్ ఏపీలో పంటనష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లో 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ అయ్యింది కనుక మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వారిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రేపు (గురువారం) ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ మే 11, 4.59పీఎం అని వ్రాసున్న క్లాప్ బాక్స్, దాని వెనుక పవన్ కళ్యాణ్ని చూపుతూ ట్విట్టర్లో మరో ఫోటో పెట్టింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేశారు. దాని తర్వాత సముద్రఖని దర్శకత్వంలో తమిళ సినిమా ‘వినోదాయ సితం’కు తెలుగు రీమేక్లో తన పాత్ర పూర్తిచేశారు. కనుక మిగిలిన నటీనటులతో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ రెండు కాక యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘ఓజి’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) సినిమా షూటింగు(పూణేలో) కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. మరోపక్క హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ‘వకీల్ సాబ్’కు సీక్వెల్ చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి లేదా ఆలోగానే ఏపీ, తెలంగాణ శాసనసభ ఎన్నికల గంట మ్రోగితే వాటిలో పాల్గొనబోతున్నారు. కనుక మరో ఏడాదిన్నర వరకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఫుల్ టైట్గా ఉండబోతోంది.