
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ ఈనెల 23వ తుఫాను రాబోతోందని హెచ్చరిక వచ్చింది. అయితే అది వాతావరణ శాఖ నుంచి కాదు ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ అప్పుడే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తిచేసి మరోదానికి సిద్దమవుతుంటే, ఎన్టీఆర్ ఇంతవరకు కొరటాలతో అనుకొన్న సినిమా మొదలుపెట్టలేదు కూడా. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు. ఇది గమనించి, ఈ సినిమాను నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ‘తుఫాను హెచ్చరిక’ అంటూ ఈ నెల 23న ఎన్టీఆర్ 30 సినిమాకి ముహూర్తం అని ట్విట్టర్లో ప్రకటించింది.
ఈ సినిమా కధాంశం సముద్రంతో ముడిపడి ఉంటుందని ఫస్ట్-లుక్ టైటిల్ పోస్టర్తోనే కొరటాల స్పష్టం చేశారు. బహుశః సముద్రంతో కధ అంటే బహుశః స్మగ్లింగ్ కధాంశం అయ్యుండవచ్చు.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించబోతోంది. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్.