ఒకప్పుడు ప్రభాస్ తెలుగులో చక్కటి ఇమ్మోషనల్, రొమాంటిక్ సినిమాలు చేసేవాడు. కానీ బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిపోయినప్పటి నుంచి ఆ స్థాయిలో యాక్షన్ చిత్రాలే వస్తున్నాయి. మద్యలో రాధేశ్యామ్ వంటి రొమాంటిక్ సినిమా చేసినప్పటికీ బాహుబలి ఇమేజ్ ఆ సినిమాను మింగేసిందని చెప్పవచ్చు. కనుక తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు కూడా ఆయన మళ్ళీ తెలుగులో చక్కటి సినిమా చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు.
ఈ విషయం ప్రభాస్ కూడా గ్రహించాడు కనుకనే మారుతి దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దానికి మారుతి మార్క్ టైటిల్ ‘రాజా డీలక్స్’ ప్రచారంలో ఉంది కానీ ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఈనెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా వివరాలను ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు బొమ్మై ఇరానీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇదివరకే అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో మరోసారి అవకాశం లభించింది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. మారుతి మార్క్ కామెడీ, లవ్, యాక్షన్తో రూపొందబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది.
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా 2023, జనవరి 12న విడుదల కాబోతోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ రెండు కాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్- కె అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపు 50 శాతం వరకు పూర్తయింది. ఇప్పుడు మారుతీ సినిమా కూడా మొదలు పెడితే వచ్చే ఏడాదిలో ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. అభిమానులకు పండగే!