తెలంగాణలో రాజ్యాంగానికి ప్రమాదం: కేటీఆర్‌

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ సీపి రాధాకృష్ణన్‌ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యేలను భయపెట్టి, ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని, ఉద్యోగాల కోసం అడిగితే నిరుద్యోగ యువతపై పోలీసులతో దాడులు చేయిస్తోందని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకుంటూ రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఎదురుదాడి చేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అరాచక వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ మంత్రులు ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి గవర్నర్‌కు వివరిస్తే ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే హోమ్ శాఖ కార్యదర్శిని పిలిపించుకుని మా పిర్యాదులపై వివరణ అడుగుతామని హామీ ఇచ్చారు,” అని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ క్రుంగిపోవడాన్ని భూతద్దంలో చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందన్నట్లు దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, “ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో.. కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి.. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం.. సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది..” అంటూ ఓ పెద్ద మెసేజ్ దాంతో బాటు వరద నీటితో నిండి ఉన్న మేడిగడ్డ బ్యారేజి వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.