బాల్క సుమన్ చిన్న ప్రయత్నం కూడా బ్యాక్ ఫైర్ అయ్యిందే

మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టబోతే అది బెడిసికొట్టింది. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌లో మహాత్మా గాంధీ, డా.అంబేడ్కర్, జ్యోతీరావు ఫూలే, గోవిందరావు ఫూలే ఫోటోల మద్య ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోటో ఉండటాన్ని తప్పు పడుతూ ట్వీట్‌ చేశారు. మహనీయుల సరసన రేవంత్‌ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమే అని ట్వీట్‌ చేశారు. 

దానిపై రేవంత్‌ రెడ్డి మద్దతుదారులు వెంటనే అదే ఛాంబర్‌లో వారి ఫోటోల మద్యనే కేసీఆర్‌ ఫోటో ఉన్న చిత్రాన్ని వెలికి తీసి, ఆనాడు మీ కేసీఆర్‌ ఫోటో కూడా పెట్టుకున్నారు కదా? అప్పుడు మీకు తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు తప్పుగా అనిపిస్తోందా? అయినా శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం ప్రోటోకాల్ అని తెలీదా? అంటూ ఘాటుగా చురకలు వేశారు. 

బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇలాంటి చిన్న చిన్న సాకులు వెతకడం అవసరమా? లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? అని ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు పిలిస్తే ఏమి చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నోటీసులు వస్తే ఏం చేయాలి?  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు హాజరుకావాలని జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ తమ అధినేత కేసీఆర్‌కి నోటీస్ పంపింది కనుక ప్రజలకు ఎలా సర్ధి చెప్పుకోవాలి? మూడు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఎప్పుడు, ఎలా బయటకు వస్తారు? వంటి కాంగ్రెస్‌ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోగలిగితే బాగుంటుంది.