
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె తన తండ్రితో సహజీవనం చేశారు కానీ ఆయనని పెళ్ళి చేసుకోలేదని అమెరికాలో ఉంటున్న మాగంటి రవీంద్ర నాథ్ కుమారుడు ప్రద్యుమ్న తారక్ ఎన్నికల సంఘానికి ఈమెయిల్ ద్వారా పిర్యాదు చేశారు.
ఆమె తాను మాగంటి గోపీనాథ్ భార్యనంటూ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు కనుక ఆమె నామినేషన్ తిరస్కరించాలని తారక్ కోరారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించింది.
తాజాగా మరో వివాదం మొదలైంది. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల అనుమానాలున్నాయంటూ ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో శనివారం పిర్యాదు చేశారు. తన కొడుకు తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నప్పుడు తాను వెళితే సిబ్బంది తనను లోనికి అనుమతించలేదన్నారు. కానీ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే ఆయనని లోనికి పంపించారన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన కొడుకు మాగంటి గోపీనాథ్ మృతి చెందాడని అనుమానంగా ఉందన్నారు. మాగంటి గోపీనాథ్ మరణవార్తని ధృవీకరించడంలో కూడా వైద్యులు ఆలస్యం చేశారన్నారు.
కనుక కొడుకు మృతి పట్ల తనకు అనుమానాలున్నాయని పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ఆమె కోరారు. పోలీసులు ఆమె పిర్యాదుని స్వీకరించి కేసు నమోదు చేసుకున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపీనాథ్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన ఆస్తుల వ్యవహారంలో కేటీఆర్ వేలు పెట్టారని, కనుక ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లి కూడా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేయలేదని స్పష్టమవుతోంది. దీనిపై కేటీఆర్ ఏవిదంగా స్పందిస్తారో, ఆయనే కొత్త విషయాలు బయటపెడతారో చూడాలి.
మహానంద కుమా ఏమన్నారో ఆమె మాటల్లోనే....
వీడియో తెలంగాణ నేస్తం సౌజన్యంతో...