గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో మంత్రులు సీతక్క, కొండా సురేఖల మంది విభేధాలు ఏర్పడ్డాయని, అందుకే వారిద్దరూ కలిసి పనిచేయడం లేదని వార్తలు వచ్చాయి. వాటిపై వారిరువురూ స్పందిస్తూ, “మా మద్య ఎటువంటి విభేధాలు లేవు.
కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి మా శాఖలు నిర్వహించుకునేందుకు మాకు పూర్తి స్వేచ్చనిచ్చారు. మేము ఇంత స్వతంత్రంగా పనిచేసుకోవడం చూసి సహించలేకనే బిఆర్ఎస్ పార్టీ సొంత మీడియా ద్వారా మా మద్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోంది.
ఇంతవరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎవరి నియోజకవర్గాలలో వారు బిజీగా ఉండటం వలన మేమందరం కలవలేకపోయాము. అంతమాత్రన్న మా మద్య విభేధాలున్నట్లు వార్తలు వ్రాయించడం సరికాదు. ఇదే రకమైన జర్నలిజమో బిఆర్ఎస్ పార్టీయే చెప్పాలి.
కల్వకుంట్ల కవిత మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటారు. కానీ కేసీఆర్ మహిళా సాధికారతని సహించలేకపోతున్నారు.
మీడియాలో ఉన్నవారు తమ పత్రిక సేల్స్ పెంచుకోవడానికో లేదా తమ న్యూస్ ఛానల్ టిఆర్పి రేటింగ్ పెంచుకోవడనైకో ఇలాంటి తప్పుడు వార్తలు వ్రాస్తే చివరికి వారే నవ్వులపాలవుతారు. కనుక మీడియాలో ఉన్నవారు ఎవరైనా సరే నిజానిజాలు తెలుసుకొని వార్తలు వ్రాస్తే మంచిది,” అని సీతక్క, కొండా సురేఖ హితవు పలికారు.