తెలంగాణ శాసనసభ రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ


గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదంతో ఆమె కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ సోమవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అంతకు ముందు కేసీఆర్‌ రాజీనామా లేఖను ఆమోదించి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ సోమవారం ఆమెను కలిసి శాసనసభ ఎన్నికల నివేదికను సమర్పించారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో 3వ శాసనసభ ఏర్పాటుకి రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ శాసనసభ కార్యదర్శి నరసింహాచారి కూడా సోమవారం ఉదయం గవర్నర్‌ను కలిశారు. తెలంగాణ రెండవ శాసనసభను రద్దు చేసి మూడవ శాసనసభకు ఏర్పాట్లు ప్రారంభించబోతున్నట్లు నరసింహాచారి తెలిపారు. 

ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసి తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దంగా ఉందని తెలియజేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఖరారు చేయగానే, ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.