ఈసారి ఖమ్మంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం, జనసేన పార్టీల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నందున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎదురీదుతున్నారు.
సిపిఎం అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారానికి ఖమ్మం వచ్చిన సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ, “తులసి వనంలో గంజాయి మొక్కవంటివాడు పువ్వాడ అజయ్ కుమార్. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుకే పంగనామాలు పెట్టిన ఘనుడు. ఆయనకు ఓట్లేస్తే బిఆర్ఎస్తో పాటు, బీజేపీ, మజ్లీస్ పార్టీలను కూడా గెలిపించిన్నట్లే. కనుక సిపిఎం అభ్యర్ధి యర్ర శ్రీకాంత్కే ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.
బిఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ పైకి పరస్పరం విమర్శించుకొంటున్నప్పటికీ ఒకదానిని మరొకటి గెలిపించుకొనేందుకు మూడు పార్టీలు తెర వెనుక చేతులు కలిపాయి. ఘోషామహల్ బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ పోటీ చేసే చోట మజ్లీస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టలేదు కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పోటీ చేసే చోట మజ్లీస్ పోటీ చేస్తోంది. అంటే ఈ మూడు పార్టీలు ఒక్కటే అని స్పష్టమవుతోందికదా?
సీపీఐ, సీపీఎం పోటీలో లేని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. అప్పుడే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించగలము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్ట మొదట ఓడిపోయే వ్యక్తి పువ్వాడ అజయ్ కుమారే. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు గెలిస్తేనే జాతీయస్థాయిలో కూడా ప్రభుత్వం మారుతుంది,” అని అన్నారు.