గజ్వేల్‌లో 154, కామారెడ్డిలో 104 నామినేషన్స్‌!

ఈసారి శాసనసభ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతుండగా ఆయనపై గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ (బీజేపీ), కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్‌) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

వారు కాక గజ్వేల్‌లో 145 మంది 154 నామినేషన్స్‌ వేయగా కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్స్‌ వేశారు. వారిలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి నిర్వాసితులు (100), అమరవీరుల కుటుంబాలకు చెందినవారు (30), రైతులు, నిరుద్యోగులు ఉన్నారు.

గత లోక్‌సభ ఎన్నికలలో వందలాది పసుపు రైతులు నిజామాబాద్‌లో ఇలాగే నామినేషన్స్‌ వేయడంతో కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. కనుక గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్స్‌ వేసిన వారిని బుజ్జగించేందుకు బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణలో 119 స్థానాలకు 4,798 మంది 5,716 నామినేషన్స్‌ వేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు వెలువడతాయి.