తెలంగాణకు బిఆర్ఎస్‌ టీ-టీమ్: కేటీఆర్‌

ప్రధాని నరేంద్రమోడీ నిన్న హైదరాబాద్‌ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్‌ ‘సీ టీమ్’ అని ఆ రెండు పార్టీలు నాణేనికి బొమ్మా బొరుసు వంటివని అన్నారు. మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, “ప్రధాని మోదీ గారు.. రాహుల్ వచ్చి.. మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు. మీరొచ్చి... మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు. మేం బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు.. మాది ముమ్మాటికీ T టీమ్.. తెలంగాణ టీమ్. తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్. 

నిన్నటి దాకా మత రాజకీయం చేశారు !! నేడు కుల రాజకీయానికి తెర తీశారా ?? పదేళ్ల మీ హయాంలో.. దేశంలోని బీసీలకు మిగిలింది వేదన... అరణ్య రోదనే కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది.. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయే బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు కానీ.. మాకు బీసీలంటే.. బలమైన వర్గాలు రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది. 

టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా ?? దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు.. రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరం.. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై కేసిఆర్,” అని ఘాటుగా ట్వీట్ చేశారు.