
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్దమైన సంగతి తెలియగానే మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు.
అయితే బిఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ మాగంటి గోపీనాథ్కు ఇచ్చేసినందున, బిఆర్ఎస్లో చేరినా టికెట్ లభించే అవకాశం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినా మళ్ళీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లేదా మరో పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి ఉండవచ్చు. కనుక బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమనే భావించవచ్చు.
మానకొండూరుకు చెందిన దరువు ఎల్లన్న, ముథోల్కు చెందిన బీజేపీ నేతలు రమాదేవి సోమవారం బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.