
ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానులంటూ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసుకొంటే, తెలంగాణ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ నగరానికి రోజుకో కొత్త ఆకర్షణలను జోడిస్తోంది. నానక్రామ్ గూడా నుంచి టిఎస్పీఏ సర్కిల్ వరకు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వెంబడి 4.5 మీటర్ల వెడల్పుతో 23 కిమీ పొడవునా రన్నింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ నిర్మిస్తోంది. దానికి ఇరువైపుల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కల్పిస్తోంది. ఈ ట్రాక్ పొడవునా పైన సోలార్ ప్యానల్స్ తో పైకప్పు నిర్మించడంతో 16మెగావాట్స్ సౌర విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది.
ప్రస్తుతం ఈ ట్రాక్కు తుదిమెరుగులు దిద్దుతున్నామని మరో 15 రోజులలో అవి పూర్తవుతాయని సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుందని నగర కమీషనర్ అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ దాని ఫోటోలు కూడా షేర్ చేశారు. దీనిపై సైక్లింగ్ మరియు రన్నింగ్ చేసేందుకు అందరూసిద్దంగా ఉండాలని ట్వీట్ చేశారు.
అయితే దీని కోసం కొత్తగా సైకిల్స్ కొనుగోలు చేయనవసరం లేదు. నానక్రామ్ గూడా, టిఎస్పీఏ సర్కిల్, నార్సింగి, కొల్లూరు చౌరస్తా, వట్టినాగులాపల్లి వద్ద అద్దెకు సైకిళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు.