తొలిరోజున పంట రుణాల మాఫీకి రూ.167.59 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీ కొరకు మొదటి విడతగా గురువారం రూ.167.59 కోట్లు రైతుల ఖాతాలలో జమా చేసింది. మొదటి విడతలో రూ.37 వేల నుంచి రూ.41 వేల మద్య రుణాలున్న 44,870 మంది రైతుల ఖాతాలలో ఈ సొమ్ము జమా చేసింది. తర్వాత లక్ష రూపాయల లోపు రుణాల మాఫీ చేస్తామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ రెండో వారంలోగా రాష్ట్రంలో 29.61 లక్షల మందికి పంట రుణాలు మాఫీ చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్లు విడుదల చేయనుంది.  

పంట రుణాల మాఫీ చేస్తుండటంపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “బిఆర్ఎస్‌ అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం..ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం. 

రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిది,” అని ట్వీట్‌ చేశారు.