లోక్‌సభ స్పీకర్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు

గురువారం ఉదయం కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణ సిఎం కేసీఆర్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ వ్రాశారు.

కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా హైదరాబాద్‌లో బాటసింగారం వద్ద నిర్మితమవుతున్న ఇళ్ళ నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు ఈరోజు ఉదయం శంషాబాద్ నుంచి వెళుతుండగా రాచకొండ పోలీస్ కమీషనర్ అధ్వర్యంలో పోలీసులు తనను అడ్డుకొని అరెస్ట్‌ చేశారని ఫిర్యాదు చేశారు. 

ఓ లోక్‌సభ సభ్యుడుగా, కేంద్రమంత్రిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించాల్సిన బాధ్యత ఉందని పోలీసులకు చెప్పినప్పటికీ వారు తనను అకారణంగా అరెస్ట్‌ చేశారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన తాను ముందుగానే తన పర్యటన గురించి రాష్ట్ర డిజిపి అంజని కుమార్‌ సమాచారం కూడా అందించానని ఆ లేఖలో పేర్కొన్నారు.

‘రూల్స్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్‌ లోక్‌సభ’ లోని సెక్షన్ 229 ప్రకారం లోక్‌సభ సభ్యుడు ఏ కారణం చేతైనా అరెస్ట్‌ కాబడినప్పుడు స్పీకర్‌కు తెలియజేయవలసి ఉంది కనుక తాను తెలియజేస్తున్నానని, కనుక తనను అకారణంగా అరెస్ట్‌ చేసినందుకు తగిన చర్య తీసుకోవలసిందిగా కోరుతున్నానని కిషన్‌రెడ్డి ఆ లేఖ ద్వారా స్పీకర్‌ ఓం బిర్లాను అభ్యర్ధించారు. 

ఓ కేంద్రమంత్రిని బలమైన కారణం ఏదీ లేకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చాలా తీవ్రమైన చర్యగానే పరిగణింపబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సూచన, అనుమతి లేనిదే తెలంగాణ పోలీసులు ఓ కేంద్రమంత్రిని అరెస్ట్‌ చేసే సాహసం చేయరని వేరే చెప్పక్కరలేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ అత్యుత్సాహం చేజేతులా కొత్త సమస్యలను తెచ్చుకొన్నట్లే అవుతుంది.