రాజయ్యకు బాగానే అక్షింతలు పడిన్నట్లే ఉన్నాయిగా

స్టేషన్‌ఘన్‌పూర్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాజయ్యను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని బాగానే అక్షింతలు వేసిన్నట్లున్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధి ప్రశ్నలకు చెప్పిన జవాబులు చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో మా ఇద్దరి మద్య ఏర్పడిన వివాదాన్ని కేటీఆర్‌ పరిష్కారించారు. ఇకపై ఎటువంటి వివాదాలు ఉండవు. ఎవరి గురించి మాట్లాడకుండా పార్టీ నాకు అప్పగించిన పనులను చేసుకువెళ్ళమని కేటీఆర్‌ ఆదేశించారు. నేను అలాగే నడుచుకొంటాను.

వ్యవసాయానికి మూడు గంటలే విద్యుత్‌ ఇస్తామంటూ రేవంత్‌ రెడ్డి ఏదో మాట్లాడారు. దానికి నియోజకవర్గంలో నిరసన తెలియజేయాలని కేటీఆర్‌ నాకు సూచించారు. రేపు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనబోతున్నాను.

కడియం శ్రీహరి తల్లి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. తల్లి ఎవరికైనా తల్లే. ఆమెను నేను కూడా గౌరవిస్తాను. అయితే కడియం శ్రీహరి తండ్రి దళితుడు కాదని మాత్రమే నేను చెప్పాను. కడియం కులం వివాదం కొత్తగా ఇప్పుడు మొదలైంది కాదు. ఎప్పటి నుంచో ఉంది. అదే నేను మాట్లాడాను.

అయితే ఇకపై ఇతరుల గురించి మాట్లాడకుండా నా పని నేను చేసుకుపోతాను. స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ ఎవరికివ్వాలనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా నాకు అభ్యంతరం లేదు,” అని తాటికొండ రాజయ్య అన్నారు. 

గత ఆరు నెలలుగా జానకీపురం సర్పంచ్ నవ్యను లైంగికంగా వేధించారని రాజయ్య ఆరోపణలు ఎదురుకొన్నారు. ఆ వ్యవహారం చల్లబడిందనుకొంటే ఇప్పుడు కడియం శ్రీహరి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన కూడా ఘాటుగానే బదులివ్వడమే కాకుండా కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కనుక రాజయ్య ప్రగతి భవన్‌లో అక్షింతలు వేయించుకొని తిరిగి వెళ్లారు.