1.jpg)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ పాత్రను, పోరాటాలను ప్రజలకు మరోమారు గుర్తుచేస్తూ, కేసీఆర్ ఒక్కరే తెలంగాణ కోసం పోరాడలేదని, కేసీఆర్ ఒక్కరి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని నొక్కి చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి నేతలు కలిసి హైదరాబాద్లో పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జండా ఎగురవేసి ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, “ఎందరో అమరుల త్యాగ ఫలం.. ఇంకెందరో బిడ్డల బలిదానం.. సబ్బండ వర్ణాలేకమై నినదించిన గళం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితం మన తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్లో “ఉద్యమంలో ఊపిరి ఆగిందెవరిది? మదమెక్కి 'తెలంగాణ'ను మింగుతున్నదెవరు? మంటల్లో మాడుతూ 'జై తెలంగాణ' అన్నదెవరు? కుటుంబంతో ఈ నేలను కబళించిందెవరు? త్యాగం ఎవరిది?ఇప్పుడు భోగం ఎవరిది?! సబ్బండవర్ణాలను సంపేసి సంబరం జరుపుకునే హక్కు కల్వకుంట్ల కుటుంబానిదా? కోట్ల తెలంగాణ గొంతులదా?” అంటూ ట్విట్టర్లో ఘాటుగా కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.