ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సూత్రధారి రాజశేఖర్: సిట్‌

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌ ఈరోజు టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డికి తన నివేదికని ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రవీణ్‌ ఉన్నప్పటికీ అసలు కధ నడిపింది మాత్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్ అని సిట్‌ నివేదికలో పేర్కొంది. అతను ఈవిదంగా చేయాలనే ఆలోచనతోనే గతంలో టెక్నికల్ సర్వీసస్‌లో చేసే అతను డెప్యూటేషన్ మీద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చాడు. ఆ తర్వాత ప్రవీణ్‌తో పరిచయం పెంచుకొని సిస్టమ్‌ని హ్యాక్ చేసి 5 ప్రశ్నాపత్రాలను తన పెన్ డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని ప్రవీణ్‌కు ఇచ్చాడు. ఫిభ్రవరి 27న పేపర్లను కాపీ చేసుకొని ప్రవీణ్‌కు ఇచ్చాడు. 

వాటిలో గ్రూప్-1 పరీక్షాపత్రంతో పాటు జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబందించిన ప్రశ్నాపత్రం కూడా ఉంది. వాటిని ప్రవీణ్‌ రేణుకకు అమ్మేశాడు. టిఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని దొంగిలించి, పరీక్షలో 103 మార్కులు సాధించగలిగాడు. ఈ కేసులో ప్రవీణ్‌కు సిస్టమ్ పాస్ వర్డ్ ఏవిదంగా సంపాదించాడని తెలుసుకొనేందుకు సిట్‌కి బృందం మిగిలిన నిందితులను కూడా ప్రశ్నిస్తోంది. 

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సిట్‌ పేర్కొన్న రాజశేఖర్ బిజెపి కార్యకర్త అని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే బిజెపి తమ కార్యకర్త ద్వారా ఈ కుట్ర చేసి ఉండవచ్చని మంత్రికేట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిట్‌ బృందం ఆ కోణంలో కూడా విచారణ జరుపుతోంది. ఒకవేళ బిజెపి ప్రమేయం ఉందని తేలితే అది మరో పెద్ద రాజకీయ యుద్దమే అవుతుందని వేరే చెప్పక్కరలేదు.