అన్నా! తొందరపడి మాట జారకు: కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన ఓ ఛార్జ్ షీట్‌లో సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఆ కేసును విచారణకి స్వీకరించిన న్యాయస్థానం ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న నిందితులందరికీ నోటీసులు పంపించింది. కనుక ఆమె న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఈరోజు ప్రగతి భవన్‌లో తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యి ఈ కేసు గురించి చర్చించనున్నారు. 

ఈ కేసులో ఆమె పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చడంపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, “ఛార్జ్ షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరుని 28 సార్లు పేర్కొంది,” అంటూ పత్రికలలో వచ్చిన ఆ వార్త క్లిప్పింగ్‌ని జత చేసి ట్వీట్ చేశారు. 

దానిపై ఆమె వెంటనే స్పందిస్తూ, “రాజగోపాల్ అన్న... తొందరపడకు, మాట జారకు!! 28సార్లు నా పేరు చెప్పించినా, 28,000 సార్లు నాపేరు చెప్పించినా అబద్దం నిజం కాదు...” అంటూ #ట్రూత్ ప్రివైల్స్ అని జవాబిచ్చారు.

కవితకి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వెంటనే ఘాటుగా బదులిచ్చారు. “నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు  కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS (#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18,000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయం లో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని  దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం,” అంటూ బదులిచ్చారు.