మునుగోడులో కొనసాగుతున్న పోస్టర్స్ యుద్ధం

మునుగోడు ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-బిజెపిల మద్యనే అనేది బహిరంగ రహస్యం. రెండు పార్టీలు కూడా ఆర్ధికంగా చాలా బలమైనవే... ఒకటి తెలంగాణలో అధికారంలో ఉంటే మరోటి కేంద్రంలో అధికారంలో ఉంది కనుక రెండూ ఒకదానికొకటి తీసిపోవని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నికలను సిఎం కేసీఆర్‌కు, ఆయన పెట్టబోతున్న బిఆర్ఎస్‌ పార్టీకి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి కనుక బిజెపి అభ్యర్ధిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దానిలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం రూ.18,000 విలువగల కాంట్రాక్ట్ ఇచ్చిందంటూ పోస్టర్స్ యుద్ధం మొదలుపెట్టింది.

ముందే చెప్పుకొన్నట్లు టిఆర్ఎస్‌కు బిజెపి అన్ని విధాలా సమఉజ్జీ కనుక టిఆర్ఎస్‌ను ఆక్షేపిస్తూ పోస్టర్స్ వేయించింది. దానిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వలననే టిఆర్ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా శివన్నగూడెం నిర్వాసితులకుఓఆర్ అండ్ ఆర్ పరిహారం వగైరాలు ఇస్తోందంటూ వేశారు. రాజన్న రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తోందని, కొత్తగా చేనేత భీమా పధకం కూడా ప్రకటించిందని పేర్కొంది.     

గత మూడున్నరేళ్ళుగా ప్రభుత్వం చుట్టూ కాళ్ళరిపోయేలా తిరిగినా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ వచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్ని విదాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారని ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు వాదిస్తున్నారు.

 కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం రూ.18,000 కాంట్రాక్ ఇచ్చింది గానీ నల్గొండ జిల్లాను పట్టిపీడించిన ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి పది పైసలు కూడా విదిలించలేదని, కనుక రాజకీయ వ్యాపారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధనమదంతో వచ్చిన ఈ ఎన్నికలలో ఆయనను చిత్తుచిత్తుగా ఓడించి టిఆర్ఎస్‌ని గెలిపించాలని టిఆర్ఎస్‌ నేతలు మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.