
తెలంగాణ బిజెపికి పెద్ద షాక్ ఇచ్చారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి. పార్టీకి రాజీనామా చేసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ణేత మధూయాష్కీ గౌడ్ తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే లౌకిక విధానలతో, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని భావించినందునే శోభారాణి మా పార్టీలో చేరారు. మున్ముందు టిఆర్ఎస్, బిజెపిల నుంచి అనేకమంది మా పార్టీలో చేరబోతున్నారు,” అని చెప్పారు.
అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు కారణం వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు బిజెపిలో తనకు టికెట్ లభించదనే. ఇంతకాలం ఆమె ఆలేరు నియోజకవర్గం నుంచి తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో బిజెపిలో కొనసాగారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యా గౌడ్ వచ్చి బిజెపిలో చేరారు. కనుక ఈసారి ఆయనకే టికెట్ కేటాయిస్తారని భావించిన శోభారాణి, కాంగ్రెస్ నుంచి టికెట్ హామీ లభించడంతో ఆ పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యం.