హైదరాబాద్‌ చేరుకొన్న సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకొన్నారు. మొదట వారం రోజుల పర్యటన అనుకొన్నప్పటికీ మద్యలో మార్పు చేసుకొని హైదరాబాద్‌ తిరిగివచ్చారు. అయితే ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ వచ్చే సమయానికి ఆయన నగరంలో ఉండరు. ప్రధాని నగరానికి రాకమునుపే ఆ రోజు ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళతారు. అక్కడ మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్రలోని రాలేగావ్‌కు వెళ్ళి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళి షిరిడీ సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్‌ తిరిగి వస్తారు.

సిఎం కేసీఆర్‌ నాలుగు రోజుల పర్యటన విజయవంతమైందని టిఆర్ఎస్‌ చెప్పుకొంటున్నప్పటికీ, ఈ నెల 27వరకు సాగాల్సిన పర్యటనలను అకస్మాత్తుగా మార్పు చేసుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌ తిరిగి రావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో ఆయన జాతీయ మీడియా, ఆర్ధిక నిపుణులు, మేధావులతో వరుస సమావేశాలు నిర్వహించి మేధోమదనం చేయబోతున్నట్లు టిఆర్ఎస్‌ చెప్పుకొన్నప్పటికీ, వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో సిఎం కేసీఆర్‌ తన పర్యటనను కుదించుకొని హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అంటున్నారు.