రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ!

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఫాంహౌస్ నిర్మించుకొన్నారంటూ రేవంత్‌ రెడ్డి 2020లో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో పిటిషన్‌ వేయగా, దానిపై ఎన్జీటీహైపవర్ కమిటీ వేసింది. 

దీంతో మంత్రి కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడలో తనకు ఫాంహౌస్ లేదని అక్కడ ఉన్నది తనది కాదని, దాంతో అసలు తనకు సంబందమే లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక తనపై విచారణకు ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని, రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ కొట్టివేయాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

దీనిపై జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, జన్వాడలో ఫాంహౌస్ మంత్రి కేటీఆర్‌దేనని నిరూపించే ఎటువంటి పత్రాలను రేవంత్‌ రెడ్డి చూపించలేకపోవడంతో, ఆయన తప్పుడు  ఆరోపణలతో ఎన్జీటీ పిటిషన్‌ వేసినట్లు భావిస్తున్నామని చెపుతూ దానిని కొట్టివేసింది.