ఏప్రిల్ 27న టిఆర్ఎస్‌ ఆవిర్భావదినోత్సవం

ఈ నెల 27న టిఆర్ఎస్‌ 22వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాకు తెలియజేశారు. హైదరాబాద్‌, మాదాపూర్ వద్ద గల హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో (హెచ్ఐసీసీ)లో 3,000 మందితో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి కేవలం ఆహ్వాతులు మాత్రమే రావాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. మిగిలినవారు ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలలో ఎక్కడికక్కడ పార్టీ జందాలు ఎగురవేసి టిఆర్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా.. ఓ పండుగలా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.          

మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టిస్ఐసిసి ఛైర్మన్‌ గాదరి బాలామల్లు తదితరులతో కలిసి ఆదివారం హెచ్ఐసీసీ ప్రాంగణం, వేదికని సందర్శించి కొన్ని సూచనలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు తదితరులతో సమావేశమయ్యి టిఆర్ఎస్‌ ఆవిర్భావదినోత్సవం గురించి చర్చించనున్నారు.