అమెరికా చేరుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా నేడు వాషింగ్‌టన్‌ చేరుకొన్నారు. అక్కడ ఆయనకు అమెరికా ప్రతినిధులు, ఎన్‌ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్రమోడీ ముందుగా ఇవాళ్ళ వాషింగ్‌టన్‌లో అడోబ్, ఆటమిక్స్, బ్లాక్ స్టోన్, ఫస్ట్ సోలార్, తదితర ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. తరువాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశమవుతారు. 

రేపు (శుక్రవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యి భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల సమస్య తదితర అంశాల గురించి చర్చిస్తారు. తరువాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని నరేంద్రమోడీ వేరేగా సమావేశమవుతారు. శుక్రవారం భారత్‌, అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాల క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో వేరేగా భేటీ అవుతారు. 

శనివారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అది ముగిసిన తరువాత భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. భారత్‌ కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ చేరుకొంటారు.