ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి కోర్టుకు హాజరు

ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఇవాళ్ళ విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రత్యక్ష సాక్షులు మరియు శాసనసభ మాజీ కార్యదర్శి రాజారాంల వాంగ్మూలాలు రికార్డ్ చేసింది. తరువాత ఈ కేసును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.     

ఈ కేసు విచారణ ముగింపు దశకు చేరుకొందని, త్వరలో రేవంత్‌ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల హెచ్చరించారు. ఇవాళ్ళ విచారణలో న్యాయస్థానం ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు రికార్డ్ చేయడం గమనిస్తే కేసు ముగింపు దశకు చేరుకొంటున్నట్లే ఉంది. అయితే ఈ కేసులో తుది తీర్పు ఏవిదంగా ఉంటుందో ఊహించడం కష్టమే. తుది తీర్పు రేవంత్‌ రెడ్డి తదితరులకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ వారు హైకోర్టుకు ఆ తరువాత అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు కనుక ఈ కేసు ఇప్పట్లో తేలేదికాదని భావించవచ్చు.