మొదలైన కౌంటింగ్..సాగర్‌లో టిఆర్ఎస్‌ ఆధిక్యత

అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. వాటితో పాటు వివిద రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్‌లో వివిద మీడియా సంస్థలు ప్రకటించినట్లే ఫలితాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. 

ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో అస్సాంలో బిజెపి కూటమి, తమిళనాడులో ప్రదాన ప్రతిపక్ష పార్టీ డీఎంకె నేతృత్వంలోని కూటమి, కేరళలో అధికార ఎల్డీఎఫ్ (వామపక్ష కూటమి), పుదుచ్చేరిలో బిజెపి కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. ఊహించినట్లుగానే పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ ఆధిక్యంలో కొనసాగుతోంది కానీ దాని వెనుకే బిజెపి దూసుకువెళ్తోంది. 

ఇక నాగార్జునసాగర్‌లో ఊహించినట్లుగానే టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌ ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్ధి కె.జానారెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా వాటిలో నోములకు 4,228 ఓట్లు, కె.జానారెడ్డికి 2,753 ఓట్లు వచ్చాయి. కనుక కె.జానారెడ్డిపై నోముల 1,475 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలలో అధికార వైసీపీ ఆధిక్యంలో ఉంది.