
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కరోనా సోకి చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని వెదిర గ్రామం.
ఎం.సత్యనారాయణరావు పలు కీలక పదవులలో పనిచేశారు. మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా, సమైక్య రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా, సమైక్య రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్గా పనిచేశారు. బోళామనిషిగా పేరున్న ఆయన రాజకీయాలపై చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో నిలిచేవారు. తెలంగాణ కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేశారు.