త్వరలో సిఎం కేసీఆర్‌ బహిరంగ సభ

ఈ నెల 14వ తేదీన సిఎం కేసీఆర్‌ అనుముల మండల పరిధిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కనుక ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో సిఎం కేసీఆర్‌ సభ నిర్వహించబోయే ఈ సభ చాలా కీలకమైనదిగా భావించవచ్చు. టిఆర్ఎస్‌ నేతలందరూ ఒక ఎత్తైతే, సిఎం కేసీఆర్‌ ఒక్కరే ఒక ఎత్తు. ఆయన సభతో సాగర్ ఓటర్లను ప్రభావితం చేయగలరు కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌ విజయావకాశాలు పెరగడమే కాక మెజార్టీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.  

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారానికి తాను లేదా మంత్రి కేటీఆర్‌ తప్పకుండా వస్తామని సిఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పారు. కనుక ఇప్పుడు సిఎం కేసీఆర్‌ వస్తుండటంతో టిఆర్ఎస్‌ శ్రేణులలో మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.    

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా నోముల భగత్ కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కె.జానారెడ్డి, బిజెపి అభ్యర్ధిగా డాక్టర్ రవికుమార్ నాయక్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 17న నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.