
ఈరోజు హాలియాలో జరిగిన బహిరంగసభలో కొందరు మహిళలు నిరసనలు తెలియజేయడంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఇటువంటి కుక్కలను చాలానే చూశాం. మీ ఐదుగురూ మర్యాదగా బయటకు వెళ్ళండి లేకపోతే బయటకు ఈడ్పించేస్తాం...”అంటూ మాట్లాడినా వీడియో క్లిప్పింగును బిజెపి మహిళానేత విజయశాంతి ఫేస్బుక్లో పోస్ట్ చేసారు. విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలను కుక్కాలంటారా?అంటూ తనదైన శైలిలో సిఎం కేసీఆర్పై ఫేస్బుక్లో వేదికగా విరుచుకుపడ్డారు.
ఇంతకీ విజయశాంతి ఏమన్నారంటే... ఆమె మాటలలోనే... “ఓటములతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయి... తెలంగాణ ప్రజలను కుక్కలని... వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలని... మేం తల్చుకుంటే నసుమైపోతారని స్వయంగా సీఎం గూండా గిరికి తెగబడుతుంటే ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీ ప్రజలు తీసుకోక తప్పదు. బాధిత మహిళలు కుక్కలా? ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి ఈ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి తీరాలి,” అని ఓ సందేశం పెట్టారు.
మరో సందేశంలో, “ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుంది. మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం... మాట తప్పితే మెడ నరుక్కుంటా... అన్నవన్నీ నిజమే అయితే, టీఆరెస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదు. ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ గారు చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనం ఉంటదో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసు. మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోంది,” అంటూ సిఎం కేసీఆర్ను ఎద్దేవా చేశారు.