రేపు ఉద్యోగసంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు వేతనాలు పెంపు, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు తదితర అంశాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దాని ఆదారంగా ఉద్యోగసంఘాలతో చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  జలనవరులశాఖ ముఖ్య కార్యదర్శి కె.రజత్‌కుమార్‌లతో ప్రభుత్వం త్రిసభ్య కమీటీని ఏర్పాటుచేసింది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించడంతో సోమవారం బీఆర్‌కె భవన్‌లో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బుదవారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వేతన సవరణ తదితర అన్ని విషయాలపై చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లపై వారితో చర్చించిన తరువాత త్రిసభ్య కమిటీ సిఎం కేసీఆర్‌కు వేతన సవరణ, పదోన్నతులు తదితర అంశాలపై సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగా సిఎం కేసీఆర్‌ ఫిబ్రవరి రెండో వారంలోగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.