
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నేడు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్, కొందరు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
ప్రమాణస్వీకారం చేసిన తరువాత జస్టిస్ హిమా కోహ్లీ రాజ్భవన్ నుంచి నేరుగా హైకోర్టు చేరుకొని ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతితో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి వస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన సంగతి తెలిసిందే.