రైతులను బెదిరించడం సరికాదు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుదవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సమగ్ర వ్యవసాయ విధానంపై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చర్చించి దానిలో అనేక లోపాలున్నాయని గుర్తించాము. సిఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఈ సమగ్ర వ్యవసాయ విధానాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తోంది.  సిఎం కేసీఆర్‌ తనకు తోచినట్లు చేసుకుపోవడం సరికాదు. దానిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించి లోటుపాట్లను సవరించి అమలుచేస్తే బాగుంటుంది. కనుక దానిని ఈ ఖరీఫ్ సీజన్‌లో అమలుచేయకుండా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చెపుతున్న ఈ నూతన విధానం ప్రకారం రైతులు పంటలు వేయకపోతే వారికి రైతు బంధును ఇవ్వమని బెదిరించడం సరికాదు. ఇది రైతులను అవమానించడమే. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొనే సిఎం కేసీఆర్‌ రైతులతో బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని ఏమనుకోవాలి? రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దంగా ఉంది,” అని అన్నారు.