
దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఒడిశాలో కరోనా కేసులు తక్కువగా నమోదు అయినప్పటికీ అవి ఇంకా పెరిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా లాక్డౌన్ను ఈ నెల 30వరకు పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలోని ఐదుగురు సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యి ఈ నిర్ణయానికి ఆమోదముద్రవేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు జూన్ 17వరకు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఈనెల 14తో లాక్డౌన్ ముగుస్తుంది. ఆ తరువాత మళ్ళీ మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తుండగానే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో లాక్డౌన్ పొదిగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒడిశాలో నేటివరకు 44 కేసులు నమోదుకాగా, ఒకే ఒకరు మృతి చెందారు.