
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో టీఎస్ఐపాస్ పేరిట నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. అది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడమే కాక యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. టీఎస్ఐపాస్ పారిశ్రామిక పాలసీకి 5 ఏళ్ళు పూర్తయినందున పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో బుదవారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్ వద్దగల శిల్పకళావేదికలో అవార్డుల కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, వివిద జిల్లాలు, శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
టీఎస్ఐపాస్ని అత్యంత సమర్ధంగా నిర్వహించి సత్ఫలితాలు సాధించిన జిల్లాలకు, వివిద ప్రభుత్వ శాఖలకు మంత్రి కేటీఆర్ నేడు అవార్డులు అందజేయనున్నారు. వీటిని మూడు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ నుంచి మూడు జిల్లాల చొప్పున ఎంపిక చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు అవార్డులను అందజేస్తారు.
టీఎస్ఐపాస్ అవార్డులకు ఎంపికైన జిల్లాలు:
ఫస్ట్ ర్యాంక్: రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్ జిల్లాలు
సెకండ్ ర్యాంక్: మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలు
థర్డ్ ర్యాంక్: జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు.
టీఎస్ఐపాస్ అవార్డులకు ఎంపికైన ప్రభుత్వ శాఖలు:
1. ఉత్తర, దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థలు
2. భూగర్భ జలవనరుల శాఖ
3. రెవెన్యూ వశాఖ
టీఎస్ఐపాస్ను అత్యంత సమర్ధంగా అమలుచేసి సత్ఫలితాలు సాధించినందుకు కొందరు ప్రభుత్వాధికారులను కూడా టీఎస్ఐపాస్ అవార్డులకు ఎంపికయ్యారు. వారి వివరాలు:
1. అహ్మద్ నదీమ్ (లేబర్, ఇండస్ట్రీస్ కమిషనర్)
2. ఈవీ నర్సింహారెడ్డి (టీఎస్ఐఐసీ)
3. టీకె. శ్రీదేవి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్)
4. అర్వింద్ కుమార్ (మెట్రోపాలిటన్ కమిషనర్)
5. విద్యాధర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)
6. కె. నీతూకుమారి ప్రసాద్ (పీసీబీ సభ్య కార్యదర్శి)